Tuesday, October 28, 2008

Add voter easily

ఇక మనం ఇంట్లోంచే వోటరుగా నమోదు చేసుకోవచ్చు. మీ క్రెడిటుకార్డు వాడి జాలంలో పుస్తకం కొనుక్కున్నట్టుగా, డ్రాప్‌బాక్సు ద్వారా ఫోను బిల్లు కటినట్టుగా, కార్డు బిల్లును చెల్లించి పారేసినట్టుగా, పోస్టాఫీసులో ఉత్తరాన్ని రిజిస్టరు చేసినట్టుగా ఇక వోటరుగా నమోదు చేసుకోవచ్చు.
ఈ విషయమ్మీద ఈనాడులో వచ్చిన వార్త చూడండి. ఆ వార్త సంక్షిప్తంగా ఇది:
ఇక నుంచి ఏ కార్యాలయానికి వెళ్లకుండానే ఇంట్లో ఉండే ఓటు హక్కును నమోదు చేయించుకోవచ్చు. రాష్ట్రంలో ఈ-నమోదు ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కల్పించింది. గత వారం రోజులుగా ఈ నమోదు ప్రక్రియను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు అమలులోకి తెచ్చారు. దీనికి విపరీతమైన స్పందన వస్తోందని ఆయన చెబుతున్నారు.
ఈ-నమోదు చేసుకోవాలంటే ముందుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులో ఉన్న ఈ-రిజిస్ట్రేషన్ ఫారాన్ని పూర్తి చేసి, రెండు ఫొటోలను అప్‌లోడ్ చేయాలి. ఈ దరఖాస్తులను ఎన్నికల కమిషన్ పరిశీలన చేస్తుంది. అర్హులని తేలితే వారికి నెల రోజుల్లో ఓటు హక్కును కల్పిస్తుంది. మొదటి రెండు మూడు రోజుల్లోనే ఈ-నమోదుకు మంచి స్పందన రావడంతో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
అలాగే..
హైదరాబాద్‌లో వచ్చే నెల 5నుంచి 212 పోస్టాఫీసుల్లో ఓటరు నమోదు ఫారాలను పెట్టి అక్కడే దరఖాస్తు పెట్టెలు (డ్రాప్ బాక్సులు) ఏర్పాటు చేస్తున్నారు. ఫారం పూర్తి చేసి రెండు ఫొటోలను జత చేసి డ్రాప్ బాక్సుల్లో పడవేస్తే నెలరోజుల్లో వారికి ఓటు హక్కును కల్పిస్తారు.
జంటనగరాల్లోని ప్రధానమైన షాపింప్ బజార్ల‌లోనూ, పెట్రోల్ బంకుల్లోనూ శనివారం నుంచి దరఖాస్తు పెట్టెలను ఏర్పాటు చేస్తున్నారు.
వచ్చే నెల అయిదో తేదీ నుంచి హైదరాబాద్‌లోని 48 ఈ-సేవా కేంద్రాల్లో కూడా ఓటరు నమోదు ప్రక్రియ మొదలవుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 1200 కేంద్రాల్లో శాశ్వత ఓటర్ల నమోదు కేంద్రాల(డీపీఎస్ సెంటర్లు) ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రండి, నమోదు చేసుకోండి అంటూ ఇన్ని ఏర్పాట్లు చేసాక కూడా నమోదు చేసుకోకుండా ఉంటామా!? జై ఎన్నికల సంఘం!

థాంక్స్ తో చదువరి గారికి


Powered By Blogger